బచ్చన్నపేట, ఆగస్టు 6 (మన సాక్షి గొంతుక):
జనగామ జిల్లా బచ్చన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట స్థావరంపై పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించి 12 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.2,59,000 నగదు, మూడు మోటార్ సైకిళ్లు, పేకముక్కలు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.పోలీసుల వివరాల ప్రకారం, పడమటి కేశవాపూర్ గ్రామ శివారులోని ఓ పామాయిల్ తోటలో కొందరు వ్యక్తులు పేకాట నిర్వహిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం అందడంతో బచ్చన్నపేట ఎస్ఐ శ్రీకాంత్ తన సిబ్బందితో కలిసి ఆకస్మికంగా దాడి చేపట్టారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న 12 మందిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద ఉన్న నగదు, మూడు మోటార్ సైకిళ్లు, పేకముక్కలు తదితర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.ఈ సందర్భంగా ఎస్ఐ శ్రీకాంత్ మాట్లాడుతూ, ప్రజల ప్రశాంత జీవనానికి భంగం కలిగించే పేకాట, జూదం, గంజాయి, అక్రమ మద్యం విక్రయాలు వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై నిరంతరం ప్రత్యేక నిఘా కొనసాగిస్తూ, ఎటువంటి రాజీ లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.గ్రామాలు, పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా పేకాట, జూదం లేదా ఇతర అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని, నేరాల నిర్మూలనలో ప్రజల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు.










