దక్షిణ కాశీశ్వరుడి గ్రామంలో బస్సు ఆపరా
కాశీనగర్లో బస్సు స్టాప్ కోసం మహిళల నిరసన
మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని కాశీనగర్ గ్రామంలో ఆర్టీసీ బస్సులు ఆపాలని డిమాండ్ చేస్తూ మహిళలు బస్సును అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి బచ్చన్నపేటకు, బచ్చన్నపేట నుంచి హైదరాబాద్కు రాకపోకలు సాగించే ఆర్టీసీ బస్సులు పోచన్నపేట తర్వాత ఉన్న కాశీనగర్ గ్రామంలో ఆపడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామంలో ప్రసిద్ధి చెందిన దక్షిణ కాశీశ్వరుడి ఆలయానికి నిత్యం భక్తులు దర్శనానికి వస్తుంటారని, అయితే బస్సులు గ్రామంలో ఆగకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మహిళలు తెలిపారు. అదేవిధంగా గ్రామం నుంచి పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్లే మహిళలు, గ్రామస్తులు రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
కాశీనగర్లో ఆర్టీసీ బస్సులకు తప్పనిసరిగా స్టాప్ ఏర్పాటు చేసి, అన్ని వర్గాల ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించాలని మహిళలు డిమాండ్ చేశారు. బస్సులు ఆపే వరకు తమ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తామని వారు తెలిపారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల నాయకుడు చొప్పరి కొమరయ్య మాట్లాడుతూ.. కాశీనగర్ గ్రామ ప్రజలు, దక్షిణ కాశీశ్వరుడి దర్శనానికి వచ్చే భక్తుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని గ్రామంలో ఆర్టీసీ బస్సులు ఆపాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులను కలిసి సమస్యను వివరిస్తామని, సంబంధిత మంత్రికి కూడా సమస్యను తీసుకెళ్లి కాశీనగర్లో బస్సులు నిలిపేలా చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తామని తెలిపారు.గ్రామ ప్రజల ఇబ్బందులను పరిష్కరించి కాశీనగర్లో బస్సు స్టాప్ ఏర్పాటు చేయాలని మహిళలు, గ్రామస్తులు కోరుతున్నారు









