దేవాదుల మోటార్లకు కరెంటు కష్టాలు….
విద్యుత్ కోతలతో నీటి తరలింపునకు ఆటంకం..
సర్పంచుల ఫోరం మండల మాజీ అధ్యక్షుడు గంగం సతీష్రెడ్డి

మన సాక్షి గొంతుక బచ్చన్నపేట: దేవాదుల ప్రాజెక్టు నుంచి గండిరామారం–బొమ్మకూరు మీదుగా తప్పస్పల్లి డ్యామ్కు నీటిని తరలించే మోటార్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో నీటి తరలింపు ప్రక్రియకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోందని సర్పంచుల ఫోరం మండల మాజీ అధ్యక్షుడు గంగం సతీష్రెడ్డి ఆరోపించారు.ఈ మేరకు ఆయన ఒక ప్రకటనలో మాట్లాడుతూ.. వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోవడంతో రైతులు సాగు చేసిన వరి పంటలకు నీటి కొరత ఏర్పడుతోందన్నారు. మరోవైపు చెరువులు, కుంటల్లో నీరు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
దేవాదుల నుంచి డ్యామ్లకు నీటిని తరలించే మోటార్లకు ముఖ్యంగా రాత్రి వేళల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో మోటార్లు పనిచేయడం లేదన్నారు. దీంతో చెరువులు, కుంటలకు నీరు చేరకపోవడంతో రైతులు పంటలను కాపాడుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.బచ్చన్నపేట మండలంలోని చెరువులు, కుంటలు నిండేలా దేవాదుల మోటార్లకు 24 గంటల పాటు నిరంతర విద్యుత్ సరఫరా అందించాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడటంతో పాటు నీటి తరలింపును వేగవంతం చేసేలా ప్రభుత్వం, సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
రైతుల పంటలకు సాగునీరు అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే నీటి కోసం మరోసారి ఉద్యమం చేపట్టాల్సి వస్తుందని గంగం సతీష్రెడ్డి హెచ్చరించారు.









