కొడవటూరులో గొర్రెలు, మేకల షెడ్ల వివాదం
87 మందిని బైండోవర్ చేసిన బచ్చన్నపేట పోలీసులు
బచ్చన్నపేట, సెప్టెంబర్ 8:
కొడవటూరు గ్రామంలో కుర్మకులస్తులకు చెందిన రెండు వర్గాల మధ్య గొర్రెలు, మేకల షెడ్ల విషయంలో కొనసాగుతున్న వివాదంపై బచ్చన్నపేట ఎస్సై శ్రీకాంత్ ముందస్తు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన షెడ్లకు సంబంధించి ఇరువర్గాల మధ్య గత కొన్ని రోజులుగా వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో, భవిష్యత్తులో ఘర్షణలు జరిగి శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని గుర్తించారు.
ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇరువర్గాలకు చెందిన మొత్తం 87 మందిని స్థానిక ఎంఆర్ఓ సమక్షంలో బైండోవర్ చేశారు. బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించి శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
బచ్చన్నపేట మండలంలో శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడబోమని పోలీసులు స్పష్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తినా వెంటనే స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
వివాదాలను చట్టపరమైన మార్గాల్లో పరిష్కరించుకోవాలని, ఎవరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని పోలీసులు సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని బచ్చన్నపేట పోలీసులు విజ్ఞప్తి చేశారు.









