ప్రజల్లో ధైర్యం నింపుతున్న ఎస్ఐ శ్రీకాంత్
సైబర్ మోసానికి గురైన బాధితుడికి అండగా నిలిచి రూ.43 వేల నగదు రికవరీ చేసిన బచ్చన్నపేట ఎస్సై శ్రీకాంత్
మన సాక్షి గొంతుక – బచ్చన్నపేట మండలం: సైబర్ మోసానికి గురైన బాధితుడికి అండగా నిలిచి, కోల్పోయిన రూ.43 వేల నగదును రికవరీ చేయించిన బచ్చన్నపేట ఎస్ఐ శ్రీకాంత్ ప్రజల్లో ధైర్యం నింపుతున్నారు.పోచన్నపేటకు చెందిన జూల సత్యనారాయణకు జూన్ 26న వాట్సాప్ ద్వారా గుర్తుతెలియని అప్లికేషన్ వచ్చింది. దానిని మొబైల్లో ఇన్స్టాల్ చేసుకున్న అనంతరం ఆయన యాక్సిస్ బ్యాంక్ ఖాతా నుంచి రూ.43 వేల నగదు మోసపూరితంగా బదిలీ అయింది. విషయం తెలుసుకున్న వెంటనే బాధితుడు బచ్చన్నపేట పోలీసులను ఆశ్రయించారు.బాధితుడి ఫిర్యాదుపై ఎస్ఐ శ్రీకాంత్ ఆధ్వర్యంలోని పోలీసులు సత్వరమే స్పందించారు. మోసపూరితంగా బదిలీ అయిన నగదును నిందితుడి ఖాతాలో హోల్డ్ చేయించి, అనంతరం అవసరమైన ప్రక్రియను పూర్తి చేసి బాధితుడికి రూ.43 వేల నగదు తిరిగి అందేలా చర్యలు తీసుకున్నారు.తనకు జరిగిన మోసం విషయంలో పోలీసులు వెంటనే స్పందించి నగదును రికవరీ చేయించడంపై జూల సత్యనారాయణ ఎస్ఐ శ్రీకాంత్తో పాటు పోలీసు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. బాధితులకు భరోసా కల్పిస్తూ, సైబర్ మోసాలపై తక్షణమే స్పందిస్తున్న ఎస్ఐ శ్రీకాంత్ తీరుపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.పోలీసుల సూచనలు: వాట్సాప్, సోషల్ మీడియా ద్వారా వచ్చే గుర్తుతెలియని APKలు, అప్లికేషన్లను మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవద్దని పోలీసులు సూచించారు. OTP, PIN, బ్యాంక్ ఖాతా వివరాలు వంటి రహస్య సమాచారాన్ని ఎవరికీ వెల్లడించరాదన్నారు. సైబర్ మోసం జరిగిన వెంటనే 1930కు కాల్ చేయాలని, అలాగే బచ్చన్నపేట పోలీస్ స్టేషన్ 8712685205, 8712685046 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు.










