ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తూనే ఉంటాం
— దళిత క్రైస్తవులపై వివక్షత చూపుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

— మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య
స్టేషన్ ఘన్పూర్, ఆగస్టు 11,(మనసాక్షి గొంతుక):
ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తూ ప్రజల హక్కుల కోసం పోరాడుతామని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. మంగళవారం నియోజకవర్గ కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డాక్టర్ రాజయ్య మాట్లాడుతూ దేశంలో దళిత క్రైస్తవులపై బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆరోపించారు. హిందూ మతంలో ఉంటేనే దళితులకు ఎస్సీ హోదా కల్పించే విధానం కొనసాగడం వివక్ష కాదా అని ప్రశ్నించారు. ఈ విషయంలో సిక్కులు, బౌద్ధులకు ఉన్న వెసులుబాటు దళిత క్రైస్తవులకు ఎందుకు ఉండకూడదని అన్నారు. బీసీ వర్గానికి చెందిన వ్యక్తి క్రైస్తవ మతంలోకి మారినా వారి కుల గుర్తింపు మారకుండా ఉండే పరిస్థితి ఉంటే, కేవలం దళితుల విషయంలోనే ఈ వివక్ష ఎందుకని నిలదీశారు. జనగణన ప్రక్రియ ప్రారంభం కాకముందే పార్లమెంట్లో బిల్లు పెట్టి దళిత క్రైస్తవుల సమస్యకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో సిఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ మాదిగలకు టికెట్లు ఇవ్వకుండా వివక్ష చూపుతోందని విమర్శించారు. మందుల శామ్యూల్ వంటి ఎమ్మెల్యేలు కూడా వివక్షను ఎదుర్కొంటున్నారని అన్నారు. గత ఎంపీ సీట్ల కేటాయింపులో కూడా రేవంత్ రెడ్డి మాదిగలపై వివక్ష చూపించారని ఆరోపించారు. బీఆర్ఎస్ దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డంకులు సృష్టించకుండా సహకరించాలని కోరారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టిస్తున్నారని కడియం శ్రీహరిపై ఆరోపించారు. మున్సిపాలిటీ కమిషనర్ ఫ్లెక్సీలకు ఇచ్చిన అనుమతులను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. దేవాదుల ప్రాజెక్టుపై కడియం శ్రీహరికి సరైన అవగాహన లేదని దేవాదుల ద్వారా 38 టిఎంసిల నీటిని సరఫరా చేసే అవకాశం ఉన్నప్పటికీ, ఆ అవకాశాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం లేదని అన్నారు. ఈకార్యక్రమంలో బిఆర్ఎస్ నేతలు తాటికొండ సురేష్ కుమార్, మాచర్ల గణేష్ గౌడ్, కనకం గణేష్, రాజన్ బాబు, మారెపల్లి ప్రసాద్, కుంభం కుమార్ తదితరులు పాల్గొన్నారు.










