కొమ్మూరి ప్రతాప్రెడ్డి ప్రత్యేక చొరవతో నిధులు మంజూరు…
గుంతలమయమైన రోడ్డుకు త్వరలో మోక్షం.. రెండు రోజుల్లో పనులు ప్రారంభం..
మన సాక్షి గొంతుక బచ్చన్నపేట, ఆగస్టు 16 బచ్చన్నపేట పట్టణంలోని గుంతలమయంగా మారిన ప్రధాన రహదారికి ఎట్టకేలకు మరమ్మతులు చేపట్టేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. నేషనల్ హైవే-365బీ పరిధిలోని బచ్చన్నపేట టౌన్లో సుమారు 2.2 కిలోమీటర్ల మేర రహదారి అభివృద్ధి, మరమ్మతు పనులకు రూ.7.50 కోట్లు మంజూరైన నేపథ్యంలో ఆర్అండ్బీ అధికారులు, కాంట్రాక్టర్లు శనివారం రహదారిని పరిశీలించి కొలతలు చేపట్టారు
గత కొంతకాలంగా ప్రధాన రహదారిపై పెద్దఎత్తున గుంతలు ఏర్పడి వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలు కురిసిన సమయంలో గుంతల్లో నీరు నిలవడంతో రహదారి పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. రహదారి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు, ప్రజాప్రతినిధులు పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.ఈ నేపథ్యంలో జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని రహదారి అభివృద్ధికి నిధులు మంజూరు చేయించారని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మొహమ్మద్ మసూద్ తెలిపారు . ప్రస్తుతం పనులకు సంబంధించిన ప్రాథమిక కొలతలు పూర్తిచేస్తుండటంతో రెండు రోజుల్లో రహదారి మరమ్మతు పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బచ్చన్నపేట మండల అధ్యక్షుడు మహ్మద్ మాసూద్ మాట్లాడుతూ.. బచ్చన్నపేట పట్టణ ప్రధాన రహదారి సమస్యను కొమ్మూరి ప్రతాప్రెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేశారని తెలిపారు. రూ.7.50 కోట్లతో 2.2 కిలోమీటర్ల మేర రహదారి మరమ్మతులు పూర్తయితే బచ్చన్నపేట ప్రజలతో పాటు ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. పనులను నాణ్యతతో, వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.










